
గ్రహణ సమయంలోనూ మూయని ఏకైక గుడి.. ఈ ఆలయానికి జీవితంలో ఒక్కసారైనా ఎందుకు వెళ్లాలి
ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి జిల్లా, స్వర్ణముఖి నది ఒడ్డున వెలసిన పవిత్ర శైవ క్షేత్రం శ్రీకాళహస్తి. మన దేశంలో ఉన్న అత్యంత ప్రాచీన, మహిమాన్వితమైన ఆలయాల్లో ఇది ఒకటి. ఈ క్షేత్రాన్ని "దక్షిణ కైలాసం" లేదా "దక్షిణ కాశీ" అని ఎంతో భక్తితో పిలుస్తారు. పంచభూత క్షేత్రాలలో ఇది వాయులింగ క్షేత్రంగా ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈ పవిత్ర క్షేత్రం వెనుక ఉన్న ఆసక్తికరమైన చరిత్ర, ఆధ్యాత్మిక విశేషాలు, శాస్త్రీయ రహస్యాలు మిమ్మల్ని షాక్ కు గురిచేస్తాయి. ఈ ఆలయానికి ఆ పేరు రావడం వెనుక ఒక అద్భుతమైన పురాణ కథ ఉంది. 'శ్రీ', 'కాళ', 'హస్తి' అనే మూడు పదాల కలయికతో శ్రీకాళహస్తి ఏర్పడింది. ఈ మూడు జీవులు తమ తమ రీతుల్లో శివలింగాన్ని పూజించి మోక్షాన్ని పొందాయి. సాలీడు తన నూలు గూడుతో, పాము రత్నాలతో, ఏనుగు స్వర్ణముఖి నది నీరు, పూలతో పరమశివుడిని ఆరాధించాయి. వీరి నిష్కల్మషమైన భక్తికి మెచ్చి పరమేశ్వరుడు మోక్షాన్ని ప్రసాదించాడు. అందుకే ఈ క్షేత్రానికి శ్రీకాళహస్తి అని పేరు వచ్చింది. శ్రీకాళహస్తి ఆలయం పంచభూత స్థలాలలో వాయు తత్వానికి ప్రతీక. గర్భగుడిలో ఉండే శివలింగం స్వయంభూ, చతురస్రాకారంలో తెల్లని వర్ణంలో ఉంటుంది. ఇక్కడి అత్యంత విచిత్రమైన విషయం ఏమిటంటే, గర్భగుడిలో గాలి వీచడానికి ఎలాంటి మార్గాలు లేకపోయినా, శివలింగానికి ఇరువైపులా ఉండే అఖండ జ్యోతుల జ్వాలలు నిరంతరం రెపరెపలాడుతూ ఊగుతుంటాయి. ఇది స్వామివారి వాయు స్వరూపానికి, ఉచ్ఛ్వాస నిశ్వాసలకు ప్రత్యక్ష నిదర్శనమని భక్తులు బలంగా నమ్ముతారు. అంతేకాకుండా ఇక్కడి మూలవిరాట్టును పూజారులు కూడా నేరుగా చేతులతో తాకరు. సాధారణంగా సూర్య గ్రహణం లేదా చంద్ర గ్రహణ సమయాల్లో దేశంలో ఉన్న అన్ని చిన్న, పెద్ద ఆలయాలను మూసివేస్తారు. కానీ శ్రీకాళహస్తి ఆలయం మాత్రం గ్రహణ సమయాల్లో కూడా తెరిచే ఉంటుంది. ఆ సమయంలో స్వామివారికి, అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహిస్తారు. గ్రహణ ప్రభావం పడని










