
బిచ్చగత్తె కొడుకు బైక్ ను తాకాడని.. చెప్పుతో దాడి.. వీడియో వైరల్
పసిబిడ్డ తెలియక చేసిన చిన్న పనికి.. బిచ్చగత్తె అయిన పిల్లాడి తల్లిని చెప్పుతో కొట్టాడో దుర్మార్గుడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. ఇంటర్నెట్ డెస్క్: పసిబిడ్డ తెలియక చేసిన చిన్న పనికి.. బిచ్చగత్తె అయిన పిల్లాడి తల్లిని చెప్పుతో కొట్టాడో దుర్మార్గుడు. పంజాబ్లోని కాపుర్తలాలోని ప్రసిద్ధ మాతా శ్రీ భద్రకాళి ఆలయ ద్వారం వెలుపల బిక్షాటన చేస్తున్న మహిళపై జరగిన ఈ దాడి.. స్థానికంగా తీవ్ర ప్రజాగ్రహాన్ని రేకెత్తించింది. ఆ మహిళతో ఉన్న పసిబిడ్డ అక్కడ నిలిపి ఉంచిన మోటార్సైకిల్ను తాకడమే ఈ వివాదానికి కారణమైంది. ఈ చిన్న కారణంతో ఆగ్రహానికి గురైన బైకు యజమాని.. ఆ పిల్లాడి తల్లిని కిందకు తోసి తన చెప్పుతో విచక్షణారహితంగా కొట్టాడు. అటుగా వెళ్తున్న భక్తులు జోక్యం చేసుకుని ఆమెను రక్షించేందుకు ప్రయత్నించినప్పటికీ.. నిందితుడు మళ్లీ వచ్చి ఆమెను కాలితో తన్నాడు. ఈ అమానుష ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధితురాలు తీవ్ర భయాందోళనకు గురై మొదట పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ముందుకు రాలేదు. అయితే, వీడియో వైరల్ కావడంతో మహిళా కమిషన్, మానవ హక్కుల కమిటీలు ఈ ఘటనపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. నిందితుడిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అనేక వర్గాల నుంచి డిమాండ్లు వెల్లువెత్తాయి. ప్రజల ఆగ్రహం, మానవ హక్కుల సంఘాల జోక్యంతో పోలీసులు సుమోటోగా స్వీకరించారు. దాడికి పాల్పడిన నిందితుడిని వికాస్ శర్మగా అధికారులు గుర్తించారు. అతనిపై బీఎన్ఎస్ నిబంధనల కింద సంబంధిత సెక్షన్లతో ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేశారు. ప్రస్తుతం పోలీసులు పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు. ప్రియాంక కుటుంబానికి రూ.20 లక్షల ఆర్థికసాయం