
లిఫ్ట్ లో ఇరుక్కుని మహిళ మృతి..! సీసీటీవీ ఫుటేజ్ వైరల్
Ongole: ప్రకాశం జిల్లా ఒంగోలులో విషాద ఘటన చోటుచేసుకుంది. మార్కెట్ సెంటర్లోని సాయి సూర్య అపార్ట్మెంట్లో లిఫ్ట్ ప్రమాదానికి గురై 50 ఏళ్ల మహిళ మృతి చెందారు. మృతురాలిని వనితగా గుర్తించారు. లిఫ్ట్లో నుంచి బయటకు వస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు ఆమె ఫ్లోర్కు, లిఫ్ట్కు మధ్యలో ఇరుక్కుపోయారు. సీసీటీవీ ఫుటేజ్లో కనిపించిన వివరాల ప్రకారం.. వనిత తన కుమార్తె, మనవడితో కలిసి లిఫ్ట్లో ఉన్నారు. కుమార్తె, మనవడు లిఫ్ట్ నుంచి బయటకు వచ్చారు. వారి వెంటే వనిత కూడా బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తుండగా.. లిఫ్ట్ తలుపులు పూర్తిగా మూసుకోకముందే ఒక్కసారిగా కిందికి పడిపోయింది. దీంతో వనిత లిఫ్ట్కు, ఫ్లోర్కు మధ్యలో ఇరుక్కుపోయారు. ప్రమాదాన్ని గమనించిన అపార్ట్మెంట్ వాసులు వెంటనే అక్కడికి చేరుకుని ఆమెను బయటకు తీశారు. తీవ్ర గాయాలైన ఆమెను అత్యవసర చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో వనిత పరిస్థితి విషమించింది. అనంతరం ఆమె చికిత్స పొందుతూనే మృతి చెందింది. ఈ ప్రమాదం నేపథ్యంలో అపార్ట్మెంట్ లిఫ్ట్ల భద్రత, నిర్వహణపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా లిఫ్ట్ తలుపులు తెరిచి ఉన్న సమయంలో కిందికి పడిపోవడంతో ఎందుకు కిందికి కదిలిందనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు