
Jane Street | ఇంటర్నెట్ డెస్క్: ‘పొట్టోడిని పొడుగోడు కొడితే.. పొడుగోడిని పోచమ్మ కొట్టిందంట’.. సరిగ్గా ఈ సామెత అమెరికాకు చెందిన ట్రేడింగ్ ప్లాట్ఫామ్ జేన్స్ట్రీట్కు సరిపోతుందేమో. భారత స్టాక్ మార్కెట్ను కొల్లగొట్టి దేశంలో నిషేధం ఎదుర్కొన్న ఈ సంస్థకు.. వాల్స్ట్రీట్లో తాజాగా గట్టి షాక్ తగిలింది. నేరుగా ఈ కంపెనీ నష్టపోనప్పటికీ.. నమ్మి పెట్టుబడి పెట్టిన ఓ హెడ్జ్ఫండ్ భారీగా నష్టపోవడంతో జేన్స్ట్రీట్కూ భారీగానే నష్టం వాటిల్లింది. వక్రమార్గంలో భారత స్టాక్ మార్కెట్ను మోసం చేసిన ఈ సంస్థకు.. ఏడాది తిరగకముందే అంతకు రెండు, మూడింతలు నష్టపోవడం గమనార్హం. ఇంతకీ ఏం జరిగిందంటే?
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిశోధకుడైన 24 ఏళ్ల లియోపోల్డ్ ఆస్చెన్బ్రెన్నర్ ఆస్చెన్బ్రెన్నర్ సిట్యువేషనల్ అవేర్నెస్ పేరిట హెడ్జ్ ఫండ్ను స్థాపించాడు. 19 ఏళ్లకే కొలంబియా విశ్వవిద్యాలయం నుంచి పట్టభద్రుడైన ఈయన.. గతంలో ఎఫ్టీఎక్స్, ఓపెన్ఏఐలలో పనిచేశాడు. అయితే, సెమీకండక్టర్ షేర్లపై సిట్యువేషనల్ అవేర్నెస్ పెట్టిన పెట్టుబడులు బెడిసికొట్టడంతో ఈ సంస్థ తీవ్ర సంక్షోభంలో పడింది. దీంతో ఈ హెడ్జ్ ఫండ్లో పెట్టుబడులు కలిగిన జేన్స్ట్రీట్కూ భారీగా నష్టం వాటిల్లింది.
సిట్యువేషనల్ అవేర్నెస్ సంస్థ జూన్ నెలలో శాన్డిస్క్లో 5.7 బిలియన్ డాలర్లు, మైక్రాన్ టెక్నాలజీలో 5.6 బిలియన్ డాలర్లు చొప్పున పెట్టుబడులు పెట్టింది. జులైలో శాన్డిస్క్ షేర్లు 47 శాతం, మైక్రాన్ షేర్లు 29 శాతం మేర కుప్పకూలాయి. దీంతో కేవలం ఒక్క నెలలోనే పోర్ట్ఫోలియో విలువ దాదాపు 67 శాతం ఆవిరైంది. కంపెనీ పోర్ట్ఫోలియోలో దాదాపు 10 శాతం వాటా కలిగిన బ్లూమ్ ఎనర్జీ షేర్లు కూడా అదే నెలలో 31 శాతం పడిపోయాయి. టీఎస్ఎంసీ, నెబియస్ షేర్లలో పెట్టిన పెట్టుబడులు కూడా నష్టాలను మిగిల్చాయి. ఫలితంగా 45 బిలియన్లుగా ఉన్న ఫండ్ విలువ దాదాపు 10 బిలియన్ డాలర్లకు పడిపోయింది. ఈ పతనం కారణంగా వాల్ స్ట్రీట్ ట్రేడింగ్ సంస్థ జేన్ స్ట్రీట్ దాదాపు 15 బిలియన్ డాలర్లు నష్టపోయినట్లు తెలిసింది. అంటే భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ.1.25 లక్షల కోట్లకు పైమాటే.
మన స్టాక్మార్కెట్లో చట్టవ్యతిరేక విధానాల ద్వారా, అక్రమంగా రూ.వేల కోట్లు ఆర్జించినట్లు తేలడంతో గతేడాది జులైలో మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నిషేధం విధించింది. స్టాక్మార్కెట్లో ఇండెక్స్ (ఆయా రంగాల సూచీ) ధరలను ప్రభావితం చేసి, మదుపరుల సొమ్మును ఈ సంస్థ కొల్లగొట్టింది. దాదాపు రూ.44,358 కోట్లు అక్రమంగా ఆర్జించినట్లు సెబీ నిర్థారించింది. కొన్నింట్లో వచ్చిన నష్టాలను మినహాయిస్తే నికరంగా రూ.36,671 కోట్లు అక్రమంగా ఆర్జించినట్లు గుర్తించింది. దీంతో రూ.4,843 కోట్లు జరిమానాగా చెల్లించాలని సెబీ ఆదేశించింది. ఈ పరిణామం జరిగిన ఏడాది తర్వాత జేన్స్ట్రీట్కు తన పెట్టుబడుల రూపంలో భారీ మొత్తంలో నష్టం వాటిల్లడం కొసమెరుపు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





