
ఇంటర్నెట్ డెస్క్: ఓవైపు తరిగిపోతున్న ఆయుధ నిల్వలు.. మరోవైపు మధ్యంతర ఎన్నికలు.. ఇటు ఇరాన్తో ఎంతకీ తెగని చర్చలు.. వీటన్నింటి మధ్య అమెరికాలో ట్రంప్ (Donald Trump) సర్కార్ నలిగిపోతోంది. పశ్చిమాసియాలో సుదీర్ఘ యుద్ధంతో లాభం కంటే నష్టమే ఎక్కువ కన్పిస్తుండటంతో సొంత దేశంలోనే అధ్యక్షుడు ట్రంప్నకు తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. దీంతో యుద్ధం (US-Iran War) నుంచి బయటపడేందుకు అగ్రరాజ్యం మార్గాలు వెతుకుతోంది. ఈ క్రమంలో ఆది నుంచి పట్టుబట్టిన ‘న్యూక్లియర్ డీల్’ను సైతం పక్కనబెట్టేందుకు ట్రంప్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. అణు అంశాలు లేకుండానే టెహ్రాన్తో ఒప్పందం చేసుకోవాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ అమెరికా మీడియా సంచలన కథనం ప్రచురించింది.
ఇరాన్ (Iran) ఎలాంటి షరతులు లేకుండా హర్మూజ్ జలసంధిని (Strait of Hormuz) పూర్తిగా అందుబాటులోకి తెస్తే ఆ దేశంతో ఒప్పందం కుదుర్చుకుందామని ట్రంప్ తన సన్నిహిత వర్గాలకు ప్రైవేటుగా చెప్పినట్లు సమాచారం. అణు డీల్ లేకుండానే ఈ యుద్ధాన్ని ముగించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఆయన పేర్కొన్నారట. శాంతి ఒప్పందం విషయంలో ఇటీవల అమెరికా-ఇరాన్ మధ్య జరిగిన చర్చలు ఫలించలేదు. మరోవైపు, పశ్చిమాసియాలో ఘర్షణలు ఎంతకాలమైనా కొనసాగించేందుకు టెహ్రాన్ సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు వెలువడ్డాయి. ఈ పరిణామాల నేపథ్యంలోనే ట్రంప్ అణు డీల్పై వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. హర్మూజ్ జలసంధిని తెరిచే విషయంలో ఇరాన్ తన డిమాండ్లను స్పష్టంగా చెబుతోంది. అమెరికా దిగ్బంధనాన్ని వెంటనే ఎత్తివేయడంతో పాటు ఈ ప్రాంతం నుంచి అగ్రరాజ్య దళాలు వెళ్లిపోవాలని టెహ్రాన్ డిమాండ్ చేసింది. యుద్ధాన్ని శాశ్వతంగా ముగించేవరకూ హర్మూజ్ను తెరవబోమని కరాఖండీగా చెప్పింది. ఇవన్నీ చర్చలకు అడ్డంకిగా మారాయి.
మరోవైపు, అమెరికాలో మధ్యంతర ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఈ ఏడాది నవంబరులో అక్కడ ఎన్నికలు జరగనున్నాయి. ఇక, హర్మూజ్లో నౌకల రవాణాకు అంతరాయం కొనసాగుతుండటంతో చమురు ధరలు దిగిరావడట్లేదు. ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని యుద్ధం నుంచి బయటపడాలని ట్రంప్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, బహిరంగంగా మాత్రం ఈ ఉద్రిక్తతలపై ట్రంప్ చేస్తున్న ప్రకటనలో భిన్నంగా ఉంటున్నాయి. తాజాగా ఓ మీడియాతో మాట్లాడుతూ.. ‘ఇరాన్తో చర్చల విషయంలో తొందరేం లేదు. మేం ప్రశాంతంగా ఉన్నాం. టెహ్రాన్లో ద్రవ్యోల్బణం తీవ్రంగా ఉంది. వారి వద్ద సరిపడా నగదు లేదు’ అని వ్యాఖ్యానించడం గమనార్హం.
మరోవైపు, అమెరికాపై ఇరాన్ మళ్లీ తీవ్ర హెచ్చరికలు చేసింది. ఒకవేళ అగ్రరాజ్య సిబ్బంది తమ దేశంలో అడుగుపెడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆ దేశ బ్రిగేడియర్ జనరల్ అలీ జహన్షాహీ హెచ్చరించారు. ప్రత్యర్థి చర్యలకు గట్టిగా బదులిస్తామన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.




