
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల వేళ అటు కూటమి -వైసీపీ మధ్య హోరా హోరీ రాజకీయం చోటు చేసుకుంటోంది. కూటమిలోని మిత్రపక్షాలు ఈ సారి తమకు సీట్ల కేటాయింపు విషయంలో పట్టు బిగిస్తున్నారు. అయితే.. మాజీ మంత్రి బాలినేని వ్వవహారం ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది. జనసేనలో ప్రాధాన్యత పైన పవన్ హామీ ఇచ్చినా.. అమలు కావటం లేదు. ఆలోచన మారినట్లు ప్రచారం సాగుతోంది.
జనసేనలో చేరిన తరువాత బాలినేని శ్రీనివాస రెడ్డి పరిస్థితి సమస్యగా మారుతోంది. జనసేనలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డిని పక్కన పెట్టారా అన్న చర్చ నడుస్తోంది. కొద్ది రోజుల క్రితం బాలినేని పార్టీ చీఫ్ పవన్ ను కలిసారు. తరువాత పార్టీలో బాధ్యతలు అప్పగించారు. అయితే.. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్లతో డైలాగ్ వార్ జరిగింది. ఆ తరువాత ఆయనను పక్కకు తప్పించారు అనే చర్చ జోరుగా సాగుతోంది. స్థానిక ఎన్నికల నిర్వహణ కమిటీలో బాలినేనికి అవకాశం ఇవ్వలేదు. ఈ ఎన్నికల వ్యూహంపై 14 మందితో కూడిన ఒక కమిటీని పవన్ ఏర్పాటు చేసారు. అందులోనూ బాలినేనికి చోటు లేదు. అలాగే తాజాగా పార్టీ కీలక నేతలు నాదెండ్ల మనోహర్, నాగబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశానికి బాలినేనికి ఆహ్వానం పంపలేదు. బాలినేని ప్రస్తుతం రాయలసీమతో పాటు ప్రకాశం జిల్లా బాధ్యతలు చూస్తున్నారు.
బాలినేని దాదాపు ఆరు జిల్లాల బాధ్యతలు పర్యవేక్షిస్తున్నా.. ఆయనకు ఎలాంటి ప్రాధాన్యత పార్టీలో దక్కటం లేదు. పూర్తిగా దూరం పెట్టినట్లు కనిపిస్తోంది. దీంతో.. ఆయన అనుచర వర్గం ఆగ్రహంతో ఉన్నట్లు చెబుతున్నారు. బాలినేని జనసేనలో చేరిన సమయంలోనే చాలామంది నుంచి అభ్యంతరాలు వచ్చాయి. కానీ అప్పట్లో రాష్ట్రస్థాయిలో పార్టీ బలోపేతాన్ని దృష్టిలో పెట్టుకొని జనసేనలో చేర్చుకున్నారు. బాలినేనితో కలిసి పని చేసేందుకు టీడీపీ నేతలు ససేమిరా అంటున్నారు. దీంతో.. పవన్ ఆలోచన ఏంటనేది స్పష్టం కావటం లేదు. బాలినేని మాత్రం పవన్ వైపే చూస్తున్నారు. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే తన కుమారుడికి సీటు పైన హామీ పొందారనే ప్రచారం సాగుతోంది. అయితే, తాజా పరిణామాలు మాత్రం బాలినేనికి అంతు చిక్కటం లేదు. దీంతో.. తన చేరికతో రెండు పార్టీల్లోనూ వ్యతిరేకత ఉండటంతో పవన్ పైనే భారం వేసి బాలినేని మౌనంగా ఉంటున్నారు. మరి.. బాలినేని రాజకీయంగా ఎలా నెట్టుకొస్తారనేది భవిష్యత్ డిసైడ్ చేయాల్సిందే.






