
Telangana government Key decision on new pensions
Telangana Govt new pensions : తెలంగాణ రాష్ట్రంలో చేయూత పథకం కింద పింఛన్ల మంజూరుకు దరఖాస్తుల స్వీకరణను ప్రభుత్వం ప్రారంభించిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల నుంచి 3.5లక్షల మందికి విడతల వారిగా కొత్తగా పింఛన్లు మంజూరు చేయాలని రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ సర్కార్ నిర్ణయించింది. ఇందులో మహిళలకు, దివ్యాంగులకు అనారోగ్యంతో ఉన్నవారికి అధిక ప్రాధాన్యం ఇస్తోంది. దరఖాస్తుల తుదిగడువు ఆగస్టు 31గా నిర్ణయించింది.
వితంతువులు, ఒంటరి మహిళలు, పైలేరియా బాధితులు, డయాలసిస్ రోగులు, దివ్యాంగులు, గీత, నేత కార్మికులతోపాటు తలసీమియా, సికిల్ సెల్ అనీమియా, హీమోఫీలియా బాధితులకు కూడా దివ్యాంగుల కేటగిరీలో పింఛన్లు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దివ్యాంగులకు రూ.4,016 ఇతరులకు రూ.2,016 ఇవ్వనున్నట్లు మార్గదర్శకాల్లో సర్కార్ పేర్కొంది. కొత్త పింఛన్లకు సంబంధించిన దరఖాస్తు ఫారం చేయూత పోర్టల్ లో అందుబాటులో ఉంటుంది.
కొత్త పింఛన్ కోసం దరఖాస్తు చేసుకుంటున్న వారు.. పూర్తి చేసిన దరఖాస్తు ఫారం, ఆధార్ కార్డు, వయస్సు ధ్రువీకరణ పత్రం, రేషన్ కార్డు/ఆహార భద్రత కార్డు లేదంటే రెవెన్యూ శాఖ జారీ చేసిన ఆదాయ ధ్రువీకరణ పత్రం, బ్యాంకు పాస్ పుస్తకం మొదటి పేజీ పమర్పించాలి. కేటగిరీని బట్టి అదనపు పత్రాలు ఇవ్వాల్సి ఉంటుంది.
వీరంతా అనర్హులే.. ♦ కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలంటే ప్రభుత్వం కొన్ని నిబంధనలు అమలు చేస్తోంది. ♦ మూడెకరాలకు మించి నీటి పారుదల భూమి లేదంటే 7.5ఎకరాలకు మించి పొడి భూమి ఉన్న కుటుంబాల్లోనివారు పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు అనర్హులు. ♦ ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేటు సంస్థలు, ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగాలు చేస్తున్న వారి కుటుంబ సభ్యులు అనర్హులు. ♦ వైద్యులు, కాంట్రాక్టర్లు, వృత్తి నిపుణులు, స్వయం ఉపాధిలో ఉన్న కుటుంబాల వారు అనర్హులు. ♦ వ్యాపార సంస్థలను నిర్వహించే కుటుంబాలు, ఇప్పటికే ప్రభుత్వ పింఛన్, స్వాతంత్ర్య సమరయోధుల పింఛన్ పొందుతున్న వారు, నాలుగు చక్రాల, భారీ వాహనాల యాజమానులు, కుటుంబ వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2లక్షలు మించి ఉన్నవారు కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు అనర్హులుగా ప్రభుత్వం పేర్కొంది.



