
వరంగల్‌లో కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళి దంపతులు మంత్రి పదవి కోల్పోయిన తర్వాత తొలిసారి కాంగ్రెస్ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కొండా మురళి కీలక వ్యాఖ్యలు చేశారు. కొండా సురేఖను సారీ చెప్పమని అడిగారని, కానీ ఆమె అలా చెప్పలేదని మురళి చెప్పారు. 'ఒక్కసారి సారీ చెప్తే మా మంత్రి పదవి పోయేది కాదు. మాటమీద నిలబడే కుటుంబం మాదన్నారు.
చెయ్యని తప్పుకు సారీ ఎందుకు చెప్పాలని పదవి ఉంటే ఉండనీ, పోతే పోనీ అని సారీ చెప్పలేదని కొండా మురళి అన్నారు. తమ బిడ్డకు తమకు సంబంధం లేదని, ఆమెకు 38 ఏళ్లు నిండాయని, ఆమె నిర్ణయాలు ఆమె స్వయంగా తీసుకుంటుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీని వీడేది లేదని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చేయడమే తమ లక్ష్యమని మురళి నొక్కి చెప్పారు.
సురేఖను గెలిపించడంలో రాహుల్ గాంధీ పాత్ర ఉందని గుర్తు చేశారు. పదవులు ఇవాళ వస్తాయి, రేపు పోతాయని, మాట కోసం తాము నిలబడతామని అన్నారు. కృతజ్ఞత అన్నది తమ రక్తంలోనే, తమ కుటుంబం లోనే ఉందని కొండా మురళి అన్నారు. కార్యకర్తలే తమ బలం, బలహీనత అని కొండా మురళి వ్యాఖ్యానించారు, వాళ్ళ కోసం ఏమైనా చేస్తానని అన్నారు.
అవసరం అయితే వాళ్ళ కోసం మరో 10 ఎకరాలు అమ్ముతానని అన్నారు. బీసీల కోసం ముందుకు వచ్చే నాయకులే లేరని అన్నారు. తన శరీరంలో నాలుగు బుల్లెట్లు ఉన్నాయన్నారు.మీ ఆశీస్సులు నన్ను బతికిస్తున్నాయన్నారు. పార్టీలో ఉండి పార్టీకి వెన్నుపోటు పొడవద్దని అన్నారు.కొండా మురళి కబ్జాలు చేసినట్టు నిరూపిస్తే రాజకీయాల నుండి బయటకు వెళ్తా అన్నారు.
గెలిచే వాళ్ళకే వరంగల్ మున్సిపల్ టికెట్లు ఇస్తామన్నారు. మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో 24మంది కార్పొరేటర్ లను గెలిపిస్తానన్నారు.వరంగల్ తూర్పు బాధ్యతలు నవీన్ రాజుకు అప్పగిస్తున్నానని చెప్పారు. తన కారు రంగు ఇండియాలోనే ఉండదని, అది ముస్లిం లకు చిహ్నం అన్నారు. అన్ని వర్గాలను కలుపుకుని పని చేస్తామన్నారు.
బసవరాజు సారయ్యను ఉద్దేశించి మాట్లాడుతూ, తాను పార్టీ మారినప్పుడు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశానని, దమ్ముంటే ఆయన కూడా రాజీనామా చేయాలని సవాలు వేశారు. ఇంకో కొన్ని రోజుల్లో ఎమ్మెల్సీ పోతుందని రేవంత్ రెడ్డి ఇస్తాడని అనుకుంటున్నాడని, కానీ ఆయనకు మళ్లీ ఎమ్మెల్సీ రాదని వ్యాఖ్యానించారు. కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై దంపతులను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. మళ్ళీ కొండా సురేఖకు మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. కొండా దంపతులు ఇకపై కాంగ్రెస్‌లోనే కొనసాగుతామని స్పష్టం చేశారు.






