ప్రత్యేక సమగ్ర సవరణ ( SIR )లో భాగంగా చేపట్టిన ఎన్యూమరేషన్ పత్రాల సమర్పణ, డిజిటలైజేషన్ ప్రక్రియకు సోమవారం అర్ధరాత్రితో గడువు ముగియనుంది. తెలంగాణవ్యాప్తంగా మొత్తం 3.38 కోట్ల మంది ఓటర్లకు ఎన్యూమరేషన్ పత్రాలను అందజేసినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఇప్పటివరకు 2.64 కోట్ల మంది ఓటర్లకు సంబంధించిన పత్రాలను డిజిటలైజేషన్ చేసినట్లు వెల్లడించారు. ప్రస్తుతం బూత్ లెవల్ అధికారుల వద్ద మరో ఐదు లక్షల పత్రాలు మాత్రమే డిజిటలైజేషన్కు సిద్ధంగా ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు.మరోవైపు సుమారు 69 లక్షల మంది ఓటర్లు ఇప్పటివరకు ఎన్యూమరేషన్ పత్రాలను సమర్పించలేదని ఎన్నికల విభాగం గుర్తించింది. వీరి వివరాలను ప్రస్తుతానికి అన్కలెక్టబుల్ విభాగంలో నమోదు చేస్తున్నారు. ఓటరు ఇచ్చిన చిరునామాలో అందుబాటులో లేకపోవడం, మరణించడం, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లడం, ఒకటి కంటే ఎక్కువ చోట్ల పేర్లు ఉండటం వంటి కారణాలతో ఈ వర్గీకరణ జరుగుతోంది. అయితే అన్కలెక్టబుల్ జాబితాలో చేరినవారికి కూడా తప్పులను సరిదిద్దుకునే అవకాశం కల్పించారు. పొరపాటున తమ పేరు ఈ జాబితాలో చేరితే సంబంధిత ప్రక్రియ ద్వారా వివరాలను సవరించుకునే అవకాశం ఉంటుంది.ఎన్యూమరేషన్ పత్రాలు ఇప్పటికే తీసుకున్న ఓటర్లు వాటిని గడువులోగా తప్పనిసరిగా బీఎల్వోలకు అందజేయాలని అధికారులు సూచిస్తున్నారు. పత్రాలను తీసుకున్నప్పటికీ తమ వద్దే ఉంచుకుని, నింపిన తర్వాత కూడా సమర్పించకపోతే ఆ వివరాలు డిజిటలైజేషన్లోకి చేరవు. ఫలితంగా ముసాయిదా ఓటరు జాబితాలో వారి పేరు కనిపించే అవకాశం ఉండదు. అందువల్ల చివరి గడువును ఎట్టి పరిస్థితుల్లోనూ వృథా చేయకుండా పత్రాలను సమర్పించాలని ఎన్నికల యంత్రాంగం స్పష్టం చేస్తోంది.ఎస్ఐఆర్-2002కు సంబంధించిన వివరాలు అందుబాటులో లేకపోయినా ఓటర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బీఎల్వోలు చెబుతున్నారు. ఎన్యూమరేషన్ పత్రంలో తమకు తెలిసిన మిగతా వివరాలను పూర్తి చేసి సమర్పించవచ్చని సూచిస్తున్నారు. అనంతరం ఏదైనా సందేహం తలెత్తి ఎన్నికల అధికారుల నుంచి నోటీసు వస్తే, ఎన్నికల సంఘం ఆమోదించిన గుర్తింపు పత్రాలను సమర్పించి తమ ఓటు హక్కును నిర్ధారించుకునే అవకాశం ఉంటుందని వివరిస్తున్నారు.ఆగస్టు 17న ముసాయిదా జాబితాఎన్యూమరేషన్ పత్రాలను సమర్పించి, డిజిటలైజేషన్ పూర్తయిన ఓటర్ల వివరాలతో ఆగస్టు 17న ముసాయిదా ఓటరు జాబితాను అధికారులు ప్రకటించనున్నారు. అప్పటికి డిజిటలైజేషన్ కాని ఓటర్ల వివరాలు ముసాయిదా జాబితాలో కనిపించకపోవచ్చు. దీనిపై సందేహాలు ఉన్నవారికి ఆగస్టు 17 నుంచి అక్టోబరు 15 వరకు నోటీసులు జారీ చేసే అవకాశం ఉంటుంది. నోటీసులు అందుకున్న ఓటర్లు సంబంధిత ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి ఎదుట హాజరై ఎన్నికల సంఘం సూచించిన గుర్తింపు పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. అవసరమైన పరిశీలన అనంతరం అర్హత నిర్ధారణ అయితే వారి పేర్లను తుది జాబితాలో చేర్చే అవకాశం ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తయ్యాక అక్టోబరు 19న తుది ఓటరు జాబితాను ప్రకటించనున్నారు.