
సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Telangana Assembly Session: సెప్టెంబర్ నెలలో శాసనసభ సమావేశాలను నిర్వహిస్తామని.. అనుభవజ్ఞులైన ప్రతిపక్ష నాయకుడు, తెలంగాణ తొలి సీఎం కె. చంద్రశేఖర్ రావు సభకు హాజరుకావాలని మరోసారి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీకి హాజరై అభివృద్ధి, సంక్షేమంపై చర్చించి.. తమకు అవసరమైన సూచనలు, సలహాలు ఇవ్వాలని కోరారు. 'రక్తం పంచుకున్న సోదరికి సాయం చేయాల్సి వస్తుందని ఇంటి నుంచి బయటికి గెంటేసిన చరిత్ర కేటీఆర్ది. కొడుకుకు బుద్ధి చెప్పాల్సిన కన్న తండ్రి కళ్లున్న ధృతరాష్ట్రుడిలా మారిపోయాడు' అని కేసీఆర్, కేటీఆర్లపై రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. పదేళ్లు ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగులను బలి తీసుకున్నారని విమర్శించారు.
ప్రజా పాలన- ప్రగతి బాట కార్యక్రమంలో భాగంగా వరంగల్ జిల్లాలోని పరకాల నియోజకవర్గంలో ముఖ్యమంత్రి దాదాపు రూ.424 కోట్ల వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన, మరికొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగ యువకులను కొందరు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని.. అలాంటి వారితో అప్రమత్తంగా ఉండాలని రేవంత్ రెడ్డి సూచించారు. ప్రజా ప్రభుత్వం రైతు, మహిళ, యువతకు ప్రథమ ప్రాధాన్యతనిస్తూ ఒక్కటొక్కటిగా అన్ని సమస్యలు పరిష్కరించుకుంటూ ముందుకు వెళుతోందని చెప్పారు. విడతల వారీగా ప్రభుత్వంలోని ఖాళీలన్నీ భర్తీ చేస్తామని పునరుద్ఘాటించారు. నిరుద్యోగ యువకుల కలలను సాకారం చేయడానికి ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నిస్తుందని హామీ ఇచ్చారు.
ప్రగతి నివేదన '32 నెలల్లో ధాన్యం కొనుగోలు చేసి 90 వేల కోట్లు రైతులకు చెల్లించాం. రైతు భరోసా, రైతు రుణమాఫీ చేసి రైతును రాజును చేయాలని ప్రయత్నిస్తున్నాం. రెండున్నరేళ్లలో రైతుల కోసం రూ.లక్ష కోట్లు ఖర్చు చేశాం. సున్నా వడ్డీ రుణాలు అందించాం. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకున్నాం. యూనిఫాం కట్టు పనిని మహిళా స్వయం సంఘాలకు అప్పగించాం. సోలార్ ప్లాంట్లు, పెట్రోల్ బంకులు జరుపుకునేలా ప్రోత్సహించాం' అని తెలంగాణ సీఎం వెల్లడించారు. 'మేం 72 వేల ప్రభుత్వ ఉద్యోగాల నియామకం పూర్తి చేశాం. పోలీస్ ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్లు ఇచ్చాం. నిరుద్యోగుల భవిష్యత్ కోసమే వయసు సడలించాం' అని వెల్లడించారు.
'నిరుద్యోగులు రాజకీయ పట్టీలు మాయ మాటలకు మోసపోవద్దు. ప్రతీ ఆరునెలలకు ఉద్యోగ ఖాళీలను గుర్తించి భర్తీ చేస్తాం. ఉద్యోగాలు భర్తీ చేసే బాధ్యత మాది.. పరీక్షలకు సిద్ధం కావాల్సిన బాధ్యత మీది' అని పేర్కొన్నారు. రైతులు, ఆడబిడ్డలు, నిరుద్యోగుల కోసమే తాము పనిచేస్తున్నట్లు తెలిపారు. 'ఆనాడు అధికారం అనుభవించారు ప్రతిపక్షంలో కార్యకర్తల రక్తాన్ని ప్రైవేటు ఆసుపత్రులకు అమ్ముకుంటున్న రక్తపిపాసులు' అని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు.
'కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే ఆయన కుటుంబానికే లాభం. ప్రజా పాలనతో ప్రజలకు లాభం. ఎవరు ముఖ్యమంత్రి అయితే ఎవరికి లాభం అయిందో లెక్కలతో చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం' అని రేవంత్ రెడ్డి వెల్లడించారు. 2029లో రెట్టింపు మెజారిటీతో ఇక్కడి ఎమ్మెల్యేలను గెలిపించాలని పిలుపునిచ్చారు. తమది సామాన్యుల కోసం పనిచేసే ప్రభుత్వం అని.. ఎంతైనా కష్టపడి సమస్యలను పరిష్కరిస్తానని ప్రకటించారు. మీ ఆశీర్వాదం ఉన్నంత కాలం వెయ్యి మంది కేసీఆర్లు వచ్చినా ఏం చేయలేరని ప్రకటించారు. ఈ బహిరంగ సభలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి , దనసరి అనసూయ సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎంపీలు వేం నరేందర్ రెడ్డి , బలరాం నాయక్ , కడియం కావ్య, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.



.webp)
