ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి పట్టణంలో రెండు పడక గదుల ఇళ్ల కోసం లక్కీ డ్రా నిర్వహించి నాలుగు నెలలు గడుస్తున్నా.. ఎంపికైన లబ్ధిదారులకు ఇళ్లను అప్పగించకపోవడం విమర్శలకు దారితీస్తోంది. మే 14న నిర్వహించిన లక్కీ డ్రాలో 108 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. అయితే ఇప్పటికీ వారికి ఇళ్ల తాళాలు అందలేదు. కనీస మౌలిక సదుపాయాలైన తాగునీరు, విద్యుత్తు, డ్రైనేజీ వంటి పనులు పూర్తికాకపోవడంతో ఇళ్ల కేటాయింపు ప్రక్రియ ముందుకు సాగడం లేదని తెలుస్తోంది.గత ప్రభుత్వ హయాంలో బెల్లంపల్లి పట్టణానికి మొత్తం 160 రెండు పడక గదుల ఇళ్లు మంజూరయ్యాయి. ఇందులో 108 ఇళ్ల నిర్మాణం పూర్తయింది. ఈ ఇళ్లకు లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు ఎమ్మెల్యే గడ్డం వినోద్ సమక్షంలో లక్కీ డ్రా నిర్వహించారు. పట్టణంలోని 34 వార్డుల నుంచి మొత్తం 496 మందిని అర్హులుగా గుర్తించారు. రిజర్వేషన్ నిబంధనల ప్రకారం ఎస్సీ కేటగిరీలో 158 మంది, ఎస్టీ కేటగిరీలో 11 మంది, మైనార్టీ కేటగిరీలో 91 మంది, ఇతర కేటగిరీల్లో 236 మంది అర్హత సాధించారు. వీరిలో నుంచి 108 మందిని లక్కీ డ్రా ద్వారా తుది లబ్ధిదారులుగా ఎంపిక చేశారు.ఇళ్ల కేటాయింపునకు సంబంధించిన వ్యవహారం గతంలో హైకోర్టు వరకు వెళ్లింది. లబ్ధిదారుల జాబితాను న్యాయస్థానం పరిశీలించింది. అనంతరం తుది జాబితాను హైకోర్టుకు సమర్పించడంతో కేటాయింపునకు మార్గం సుగమమైంది. దీంతో అధికారులు లక్కీ డ్రా నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేశారు. డ్రా పూర్తయిన తర్వాత తమకు త్వరలోనే ఇళ్లు అందుతాయని లబ్ధిదారులు ఆశించారు. అయితే నెలలు గడుస్తున్నా పరిస్థితిలో మార్పు కనిపించకపోవడంతో వారి నిరీక్షణ కొనసాగుతోంది. ఇళ్ల నిర్మాణం పూర్తయినా వాటిని నివాసయోగ్యంగా మార్చేందుకు అవసరమైన మౌలిక వసతుల కల్పన మాత్రం ఇంకా పూర్తికాలేదు. కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి సరఫరా వంటి సదుపాయాలు అందుబాటులోకి రాలేదు. విద్యుత్తు కనెక్షన్లు కూడా ఏర్పాటు చేయాల్సి ఉంది. ప్రహరీ నిర్మాణం కూడా పూర్తికాకపోవడంతో భద్రతపై లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.మౌలిక వసతులు లేకపోయినప్పటికీ ముందుగానే లక్కీ డ్రా నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేయడంపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. డ్రాలో పేరు వచ్చినప్పటికీ ఇల్లు తమ చేతికి రాకపోవడంతో ఎంపిక ప్రక్రియ ప్రయోజనం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇళ్ల చుట్టూ ప్రహరీ లేకపోవడంతో కేటాయించిన స్థలం ఆక్రమణకు గురయ్యే ప్రమాదం ఉందని లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ఖాళీ ప్రదేశాల్లో పిచ్చిమొక్కలు విపరీతంగా పెరిగిపోతున్నాయని చెబుతున్నారు. కాలనీ నిర్మాణం పూర్తయినప్పటికీ వినియోగంలోకి రాకపోవడంతో పరిసరాలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయని వాపోతున్నారు.ఇప్పటికే ఇళ్ల కోసం లక్కీ డ్రాలో ఎంపికైన కుటుంబాలు తమకు కేటాయించిన గృహాల్లోకి ఎప్పుడు వెళ్లగలమో తెలియక ఎదురు చూస్తున్నాయి. ప్రభుత్వం, అధికారులు వెంటనే మిగిలిన మౌలిక వసతుల పనులను పూర్తి చేసి ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించాలని వారు కోరుతున్నారు. మరోవైపు ఇంకా నిర్మాణం ప్రారంభం కాని 52 ఇళ్ల పనులను కూడా పూర్తి చేయాల్సి ఉంది. మొత్తం 160 ఇళ్ల ప్రాజెక్టును పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకువచ్చి, ఎంపికైన కుటుంబాలకు సకాలంలో గృహాలు అప్పగించాల్సిన అవసరం ఉంది.



