
సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Lingamaneni Sanjush Accident Case: ఐటీ కారిడార్లో భోజనం చేసి రోడ్డు దాటుతూ వెళ్తున్న యువతిని అత్యంత వేగంగా కారుతో దూసుకొచ్చి ఢీకొట్టడంతో ఆమె ఎగిరి కిందపడి దుర్మరణం చెందింది. ఈ ప్రమాదం చేసిందెవరో కాదు ఏపీలోని జనసేన పార్టీ ఎంపీ లింగమనేని రమేశ్ కుమారుడు లింగమనేని సంజూశ్. ప్రమాదం జరిగి నాలుగు రోజుల తర్వాత పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారం సంచలనం రేపుతోంది. ఇంకా అరెస్ట్ చేయకపోవడంతో పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
హైదరాబాద్ మాదాపూర్లోని ఇన్ఆర్బిట్ మాల్లోని లైఫ్స్టైల్ స్టోర్లో పనిచేసే ఇద్దరు మహిళా ఉద్యోగులు భారతి ముఖి (26), పూజా అశోక్ ఆగస్టు 16న భోజనం కోసం రోడ్డు అవతల ఉన్న హోటల్కు వెళ్లారు. భోజనం చేసి వారిద్దరూ మధ్యాహ్నం 3 గంటల సమయంలో తిరిగి విధుల్లో చేరేందుకు వస్తూ రోడ్డు దాటుతున్నారు. ఆ సమయంలో స్పోర్ట్స్ కారు (టీజీ09జీ0666) కారు అత్యంత వేగంగా దూసుకువచ్చి భారతి ముఖిని ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు భారతి ముఖి ఎగిరి కిందపడగా.. పూజా అశోక్కు స్వల్ప గాయాలయ్యాయి.
కారును ఏపీ రాజ్యసభ సభ్యుడు లింగమనేని రమేశ్ కుమారుడు లింగమనేని సంజూశ్ డ్రైవింగ్ చేస్తున్నాడు. ప్రమాదం అనంతరం వెంటనే తీవ్ర గాయాలపాలైన భారతి ముఖికి హుటాహుటిన అదే కారులో జూబ్లీహిల్స్లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. ప్రమాద సమయంలో భారతి ముఖితో ఉన్న పూజా అశోక్ వెంటనే ఈ విషయాన్ని లైఫ్స్టైల్ స్టోర్ మేనేజర్ అశ్విన్ కుమార్కు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న అశ్విన్ కుమార్ హుటాహుటిన ఆస్పత్రికి వెళ్లగా భారతి ముఖి అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు.
నిర్లక్ష్యంగా, అతివేగంగా కారు నడిపి భారతి ముఖి మృతికి కారణమైన ఎంపీ కుమారుడు సంజూశ్పై మాదాపూర్ పోలీసులకు లైఫ్స్టైల్ స్టోర్ మేనేజర్ అశ్విన్ కుమార్ ఫిర్యాదు చేశారు. అడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు క్రైమ్ నంబర్ 1238/2026 నమోదు చేశారు. బీఎన్ఎస్ సెక్షన్ 106(1) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ప్రమాదానికి కారణాలు నిత్యం బిజీగా ఉండే కేబుల్ బ్రిడ్జ్ సమీపంలో అత్యంత వేగంగా రావడమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. కారు వేగం, డ్రైవర్ నిర్లక్ష్యం ఉండడంతో పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ప్రమాద సమయంలో రోడ్డు పరిస్థితులు, సీసీటీవీ దృశ్యాలు తదితర అంశాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన ప్రత్యక్ష సాక్షులు, వాహనం వివరాలు, డ్రైవర్ పాత్రపై కూడా దర్యాప్తు కొనసాగుతోంది.
పెద్దల ఒత్తిడి? ప్రమాదం జరిగి నాలుగు రోజులు గడిచిన తర్వాత నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేయడం విమర్శలకు తావిస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవింగ్ చేసిన ఎంపీ కుమారుడు సంజూశ్పై చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించినట్లు విమర్శలు వస్తున్నాయి. నాలుగు రోజుల తర్వాత కేసు నమోదు చేసిన పోలీసుల తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తన కుమారుడు సంజూశ్ను కాపాడుకునేందుకు ఎంపీ లింగమనేని రమేశ్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు.. పెద్దల ద్వారా పోలీసులపై ఒత్తిడి తీసుకువస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. కాగా మృతురాలు ఒడిశా రాష్ట్రానికి చెందినవారు. కేసు నమోదు కాకుండా తీవ్ర ప్రయత్నాలు జరిగాయని.. మృతురాలి కుటుంబీకులను ప్రత్యేకంగా విమానంలో హైదరాబాద్కు రప్పించినట్లు.. బాధితులతో మాట్లాడి వారితో బేరసారాలు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏది ఏమి జరిగినా ఒకరి ప్రాణం తీసిన ఎంపీ కుమారుడిని అరెస్ట్ చేసి శిక్ష పడేలా చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది.



