
సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Telangana Govt Employees: ఎన్నికల సమయంలో అడ్డగోలు హామీఇచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఒక్కటీ కూడా నెరవేర్చకపోవడంతోపాటు కాలయాపన చేస్తూ తమను విస్మరిస్తుండడంపై ప్రభుత్వ ఉద్యోగులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. తమకు దక్కాల్సిన ప్రయోజనాలు, న్యాయపరంగా రావాల్సినవి ఇవ్వడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీనమేషాలు వేస్తుండడంపై ప్రభుత్వ ఉద్యోగ వర్గాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశంలోనే ఎక్కడ లేని విధంగా అత్యధికంగా డీఏలు పెండింగ్, వేల కోట్ల పెండింగ్ బిల్లులు, వందల మంది రిటైర్డ్ ఉద్యోగులు బెనిఫిట్స్ రాలేదు. దీనిపై చర్చలు, కమిటీలతో కాంగ్రెస్ ప్రభుత్వం కాలం వెళ్లదీస్తుండడంతో ఇక తట్టుకోలేక ప్రభుత్వ ఉద్యోగ వర్గాలు భారీ ఆందోళనకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఉద్యమ కార్యాచరణను ప్రకటించారు.
కాంగ్రెస్ సర్కార్పై తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు జంగ్ సైరన్ మోగించారు. పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించారు. కార్యాచరణలో భాగంగా జిల్లా కేంద్రాల్లో నల్లబ్యాడ్జిలతో నిరసన తెలపనున్నారు. అనంతరం సెప్టెంబర్ 10వ తేదీన ఛలో హైదరాబాద్కు ఉద్యోగ సంఘాలు పిలుపునిచ్చాయి. అన్నీ జిల్లాల నుంచి ఛలో హైదరాబాద్ కార్యక్రమానికి తరలివచ్చి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ ఆందోళన చేపట్టాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయి. ఇప్పటికే చాలాసార్లు ప్రభుత్వం మాట విన్నామని.. ఇకపై రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తమ తడాఖా ఏంటో చూపిస్తామని ఉద్యోగ సంఘాల జేఏసీ హెచ్చరించింది. కొత్త వేతన సవరణ సంఘం (పీఆర్సీ)ని వెంటనే ప్రకటించాలని.. పెండింగ్లో ఉన్న ఆరు డీఏలను ఇవ్వాలని ఉద్యోగ జేఏసీ నాయకులు డిమాండ్ చేస్తున్న ప్రధాన విషయాలు. అవి చేయకుండా హెల్త్ కార్డులు ఇచ్చినా ఉపయోగం లేకుండా పోయాయని ఉద్యోగులు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల జేఏసీ అధ్యక్షుడు మారం జగదీశ్వర్ కీలక వ్యాఖ్యలు చేశారు. 'జూన్ 2వ తేదీన అన్ని డిమాండ్స్ పరిష్కరిస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు. హెల్త్ కార్డు విధి విధానాలు, ఏ ఆసుపత్రులు అనేది ఇప్పటివరకు స్పష్టత లేదు. ఏ ఆసుపత్రిలో ఏ చికిత్స చేస్తారని ఇప్పటికీ సమాచారం లేదు. మూడు నెలల నుంచి డబ్బులు కడుతున్నాం' అని వివరించారు. ఇక వేతన సవరణ సంఘం (పీఆర్సీ)పైన ఇంకా ఎలాంటి సమాచారం లేదని మారం జగదీశ్వర్ తెలిపారు. జూన్ 2వ తేదీన పీఆర్సీ అమలు చేస్తామని, జీపీఎస్ని మ్యానిఫెస్టోలో పెట్టి అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు మాట్లాడటం లేదని విమర్శించారు.
'రేవంత్ రెడ్డి పిలిచి మాట్లాడినప్పుడు దాని అమలు చేయాల్సిన బాధ్యత అధికారులది. కానీ ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇక ఆగే ఓపిక మాకు లేదు' అని ఉద్యోగ సంఘాల జేఏసీ అధ్యక్షుడు మారం జగదీశ్వర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరసన తెలియజేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. 27వ తేదీ అన్ని ప్రభుత్వ కార్యాలయాల వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టబోతున్నట్లు వెల్లడించారు. సెప్టెంబర్ 10వ తేదీన ఛలో హైదరాబాద్ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. 'రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి మూడేళ్లు దాటినా ఇంకా పీఆర్సీ అమలు చేయలేదు. మీరు ఇస్తా అన్నదే మేము అడుగుతున్నాం. రిటైర్డ్ ఉద్యోగులు పెండింగ్ బిల్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది' అని ఉద్యోగ సంఘాల జేఏసీ అధ్యక్షుడు మారం జగదీశ్వర్ గుర్తుచేశారు.





