
Former Education Minister Dharmendra Pradhan Explains Why He Resigned Over Neet Controversy
Dharmendra Pradhan NEET Resignation : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీ వివాదంపై కేంద్ర మాజీ విద్యాశాఖ మంత్రి, సంబల్పూర్ ఎంపీ, బీజేపీ సీనియర్ నాయకుడు ధర్మేంద్ర ప్రధాన్ తొలిసారిగా బహిరంగంగా స్పంది
Dharmendra Pradhan NEET Resignation : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీ వివాదంపై కేంద్ర మాజీ విద్యాశాఖ మంత్రి, సంబల్పూర్ ఎంపీ, బీజేపీ సీనియర్ నాయకుడు ధర్మేంద్ర ప్రధాన్ తొలిసారిగా బహిరంగంగా స్పందించారు. ఈ నిరసనల సమయంలో 'జెన్ జీ'ని ఉద్దేశపూర్వకంగా తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు జరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ వివాదం కారణంగానే తాను కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చిందని ఆయన స్పష్టం చేశారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నీట్ విద్యార్థుల భారీ నిరసనల మధ్య జూలై 25వ తేదీన ఆయన తన మంత్రి పదవి నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. సరిగ్గా రెండు వారాల తర్వాత భువనేశ్వర్లోని జీఎం విశ్వవిద్యాలయంలో ఉపాధ్యాయులు, విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.పదవి కన్నా యువత భవిష్యత్తే ముఖ్యం..!నీట్ అభ్యర్థులు, ప్రస్తుత తరం యువతను ఉద్దేశించి ధర్మేంద్ర ప్రధాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. "ధర్నాలు చేసిన జెన్ జీలు కూడా మన పిల్లలే. కానీ కొందరు కావాలనే వారిని తప్పుదోవ పట్టించారు. అప్పట్లో నాకు ఎలాంటి వ్యక్తిగత సమస్యలు లేవు. భారత దేశంలో ప్రతి ఏడాదీ కనీసం రెండు కోట్ల మంది పిల్లలు జన్మిస్తున్నారు. గత పదేళ్ల లెక్కలు తీసుకుంటే 20 కోట్ల మంది పిల్లలు పుట్టారు. వారందరికీ ఎన్నో ఉన్నతమైన ఆకాంక్షలు ఉంటాయి. వారే భవిష్యత్తులో భారతదేశాన్ని విశ్వ గురుగా నిలబెడతారు. అందుకే నాకు పదవి ఏమాత్రం ముఖ్యం కాదు" అని ప్రధాన్ వివరించారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే తాను స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వద్దకు వెళ్లి.. కేంద్ర మంత్రిమండలి నుంచి తన రాజీనామాను సమర్పించినట్లు ఆయనవెల్లడించారు.నవీన్ పట్నాయక్పై తీవ్ర విమర్శలు..!అనంతరం రైరాఖోల్లో జరిగిన మరో సమావేశంలో పాల్గొన్న ధర్మేంద్ర ప్రధాన్.. ఒడిశా మాజీ ముఖ్యమంత్రి, బిజూ జనతాదళ్ (బీజేడీ) అధినేత నవీన్ పట్నాయక్ లక్ష్యంగా తీవ్ర విమర్శలు గుప్పించారు. తనను లక్ష్యంగా చేసుకుని బీజేడీ శ్రేణులు చేస్తున్న నిరసనలకు తాను ఏమాత్రం భయపడబోనని స్పష్టం చేశారు. విమానాశ్రయం వద్ద బీజేడీ యువజన, విద్యార్థి విభాగాల కార్యకర్తలు.. ధర్మేంద్ర ప్రధాన్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేయడంపై ఆయన ఘాటుగా స్పందించారు. "నేను ఒక సాధారణ రైతు బిడ్డను. మీరు నన్ను వెళ్లిపొమ్మని ఎంతగా అరిచినా నేను మళ్లీ మళ్లీ వస్తూనే ఉంటాను" అని బదులిచ్చారు.యువతను తనపైకి ఉసిగొల్పుతున్నారని నవీన్ పట్నాయక్పై ప్రధాన్ మండిపడ్డారు. "నేను ఒడిశా ప్రజలకు ఒక మాయని మచ్చను, ఒక చెడ్డ వ్యక్తిని అని నవీన్ బాబు అంటున్నారు. నా వల్ల ఒడిశా ప్రజలకు ఎప్పుడైనా అవమానం జరిగిందా?" అని సభలో అడగ్గా.. లేదు అంటూ అక్కడి జనం నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. రాష్ట్రానికి తాను పెద్దగా కీర్తి ప్రతిష్ఠలు తీసుకురాకపోయి ఉండొచ్చు కానీ.. తన పనుల వల్ల ఎన్నడూ రాష్ట్ర పరువు తీయలేదని ఆయన ఉద్ఘాటించారు. అలాగే సంబల్పూర్ ఇలవేల్పు అయిన సమలేశ్వరి దేవి, అలాగే పూరీ జగన్నాథుడి ఆశీస్సులతోనే తాను 12 ఏళ్ల క్రితం కేంద్ర మంత్రిని అయ్యానని ప్రధాన్ గుర్తు చేసుకున్నారు. అయితే ఈ సభా వేదికపై బీజేడీ ఎమ్మెల్యే, శాసనసభ ఉపనేత ప్రసన్న ఆచార్య కూడా ఉండటం గమనార్హం. బీజేడీ నిరసనల దృష్ట్యా తాను ఈ సభకు రావాలా వద్దా అని ప్రసన్నను అడిగానని.. కానీ ఆయన సాదరంగా ఆహ్వానించడంతోనే ఇక్కడికి వచ్చానని ప్రధాన్ చెప్పారు.లాఠీఛార్జి వల్లే చెడ్డపేరు: కౌంటర్ ఇచ్చిన బీజేడీధర్మేంద్ర ప్రధాన్ చేసిన వ్యాఖ్యలపై బీజేడీ సంబల్పూర్ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి రోహిత్ పూజారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. "ప్రధాన్కు ఎవరూ ఉద్దేశపూర్వకంగా చెడ్డపేరు తీసుకురాలేదు. జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా నిరసన తెలుపుతున్న నీట్ విద్యార్థులపై పోలీసులు చేసిన లాఠీఛార్జి, టియర్ గ్యాస్ ప్రయోగం, దౌర్జన్యాల వల్లే ఆయనకు, ఆయన ప్రభుత్వానికి తీవ్ర అపఖ్యాతి వచ్చింది. ఇలాంటి సంఘటనల వల్లే ఆయన విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. పోలీసుల దౌర్జన్యాలకు నవీన్ పట్నాయక్ను నిందించడం అర్థరహితం" అని రోహిత్ పూజారి కౌంటర్ ఇచ్చారు. ఇదిలా ఉండగా.. ధర్మేంద్ర ప్రధాన్ పర్యటన నేపథ్యంలో బీజేడీ యువజన, విద్యార్థి విభాగాలు భారీ నిరసనలకు దిగే అవకాశం ఉందని ముందస్తు సమాచారం అందుకున్న సంబల్పూర్ పోలీసులు, ముందుజాగ్రత్త చర్యగా దాదాపు 30 మంది బీజేడీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.
