
సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Devdutt Padikkal Century: సుదీర్ఘ విరామం తర్వాత టెస్టుల్లోకి ఎంట్రీ ఇచ్చిన సీనియర్ ఆటగాడు దేవ్దత్త్ పడిక్కల్ శ్రీలంకతో జరిగిన తొలి టెస్టు మ్యాచ్లో అదరగొట్టాడు. తొలి రోజు బ్యాటింగ్ చేసిన భారత జట్టు 288/2తో ఆటను ముగించింది. రీఎంట్రీతో పడిక్కల్ అద్భుతంగా ఆడి 131 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. కేఎల్ రాహుల్ భారీగా దంచికొట్టినా రిటైర్డ్ ఔటవగా.. కెప్టెన్ శుభమన్ గిల్ తక్కువ స్కోర్ ఔటయి నిరాశపర్చాడు. స్వాతంత్య్ర దినోత్సవం రోజు ప్రత్యర్థి గడ్డపై ఆడిన భారత జట్టు భారీ స్కోర్ సాధించింది. 73 ఓవర్లు ఆడిన భారత జట్టు రెండు వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది.
గాలే వేదికగా శ్రీలంకతో తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభమవగా.. వర్షం అడ్డంకిగా నిలిచింది. పలుసార్లు వర్షం అంతరాయంతో మ్యాచ్కు బ్రేక్ ఇచ్చి మళ్లీ కొనసాగించారు. టాస్ గెలిచి భారత జట్టు బ్యాటింగ్ ఎంచుకుని తొలి రోజు ఆటను రెండు వికెట్లకు 288 పరుగులతో ముగించింది. రెండేళ్ల తర్వాత ఎంట్రీ ఇచ్చిన దేవదత్ పడిక్కల్ అద్భుతంగా ఆడాడు. మొదటి ఇన్నింగ్స్లో పడిక్కల్ 134 బంతుల్లో అద్భుత సెంచరీతో తన మొదటి అంతర్జాతీయ శతకాన్ని నమోదు చేశాడు. మొత్తం 178 బంతులు ఆడిన దేవదత్ 131 పరుగులు చేయగా.. 12 ఫోర్లు, ఒక సిక్సర్తో అదరగొట్టాడు. సాయిసుదర్శన్ గాయం కారణంగా లంకతో సిరీస్కు పడిక్కల్కు జట్టులో స్థానం లభించింది. చాలాకాలం తర్వాత తనకు లభించిన అవకాశాన్ని పడిక్కల్ సద్వినియోగం చేసుకున్నాడు.
ఓపెనర్గా దిగిన యశస్వి జైస్వాల్ 37 బంతుల్లో 32 పరుగులు చేయగా.. వాటిలో ఐదు ఫోర్లు ఉన్నాయి. స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ 77 పరుగులతో రాణించాడు. 162 బంతులు ఆడిన రాహుల్ 9 ఫోర్లు, ఒక సిక్సర్ బాదాడు. కుడి చేయి నొప్పి రావడంతో ఇబ్బంది పడిన రాహుల్కు ఫిజియో వచ్చి ప్రథమ చికిత్స చేసినా తగ్గకపోవడంతో రిటైర్డ్ హర్ట్గా మైదానం వీడాడు. కెప్టెన్ శుభమన్ గిల్ 28 ంతుల్లో 16 పరుగులు చేసి ఔటవగా.. క్రీజులో 27 పరుగులతో రిషబ్ పంత్ ఉన్నాడు. శ్రీలంక బౌలర్లు వికెట్ల కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. తొలి రోజు దెబ్బతీసేందుకు ప్రయత్నించగా అతి కష్టం మీద రెండు వికెట్లు తీశారు.
వరుణుడు ఆటంకం భారత్, శ్రీలంక మధ్య జరుగుతున్న తొలి టెస్టుకు వరుణుడు ఆటంకం కలిగించాడు. లంచ్ బ్రేక్ సమయంలో వర్షం పడడంతో ఆటగాళ్లు ఆలస్యంగా మైదానంలోకి అడుగుపెట్టారు. వర్షం కారణంగా గంటన్నర సమయం వృథా అయ్యింది.



