Delhi Bus Safety Guidelines 2026 : దేశ రాజధాని ఢిల్లీలో కదులుతున్న స్లీపర్ బస్సులో మైనర్ బాలికపై డ్రైవర్, కండక్టర్ దారుణంగా సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ ఘటనతో అప్రమత్తమైన ఢిల్లీ సర్కారు మంగళవారం రోజు సంచలన నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా పబ్లిక్, ప్రైవేట్ బస్సుల్లో ప్రయాణికులు, మహిళల రక్షణకు సంబంధించిన నిబంధనలను అత్యంత కఠినతరం చేసింది. ఢిల్లీలో నడిచే స్థానిక బస్సులతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే అన్ని బస్సుల్లోనూ.. పానిక్ బటన్లు కచ్చితంగా పని చేయాల్సిందేనని, అలాగే కిటికీలకు పర్దాలు కూడా ఉంచకూడదని స్పష్టం చేసింది. ఆ పూర్తి వివరాలు మీకోసం.దారుణ ఘటనతో కదిలిన యంత్రాంగం..!ఆగస్టు 4వ తేదీ రాత్రి గ్రేటర్ నోయిడాలో బస్సు ఎక్కిన మైనర్ బాలికపై డ్రైవర్, కండక్టర్ అత్యాచారానికి పాల్పడ్డారు. దాడి అనంతరం బాధితురాలిని దాదాపు 40 కిలో మీటర్ల దూరంలో ఉన్న కాశ్మీరీ గేట్ సమీపంలో పడేసి పారిపోయారు. ఈ ఘటన జరిగిన బస్సు కిటికీలకు లోపలి దృశ్యాలు బయటకు కనిపించకుండా ఉండేందుకు కిటికీల పర్దాలు కప్పి ఉంచడం, అలాగే నిబంధనల ప్రకారం పనిచేసే సీసీటీవీ కెమెరా వ్యవస్థ లేకపోవడం నేరస్థులకు కలసివచ్చింది. 2012 నాటి నిర్భయ ఘటన జ్ఞాపకాలను మళ్లీ గుర్తు చేసిన ఈ ఉదంతంతో.. ఢిల్లీ ప్రభుత్వం తక్షణమే మేల్కొని నిబంధనలను కఠినతరం చేసింది.పర్దాలపై నిషేధం.. పానిక్ బటన్స్ తప్పనిసరినూతన నిబంధనల ప్రకారం.. బస్సు కిటికీలకు ఉండే పర్దాలు, నిబంధనలకు విరుద్ధంగా వేసే విండో ఫిల్మ్లను పూర్తిగా నిషేధించారు. విండ్షీల్డ్, వెనుక అద్దాలు, పక్క కిటికీల పారదర్శకత చట్టబద్ధంగా ఉండాల్సిందే. బస్సుల్లో వెహికల్ లొకేషన్ ట్రాకింగ్ డివైజ్లు, పానిక్ బటన్లు నిరంతరం పనిచేసే స్థితిలోనే ఉండాలని ఆదేశించారు. ప్రయాణికులకు సులభంగా అందుబాటులో ఉండేలా పానిక్ బటన్లను అమర్చాలి. వీటితో పాటు పని చేసే అగ్నిమాపక పరికరాలు, ప్రథమ చికిత్స కిట్లు ప్రతి బస్సులో ఉండటం తప్పనిసరి చేశారు. రాత్రి సమయాల్లో లేదా సర్వీసులో లేనప్పుడు వెలుతురు ఉండే సురక్షిత ప్రాంతాల్లోనే బస్సులను పార్క్ చేయాలి.సిబ్బంది ప్రవర్తనపై డేగకన్ను.. రవాణా మంత్రి హెచ్చరికడ్రైవర్లు, కండక్టర్లు ప్రయాణికులతో మర్యాదగా ప్రవర్తించాలని, మద్యం లేదా ఇతర మత్తు పదార్థాలు సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు ఉంటాయని ప్రభుత్వం పేర్కొంది. బస్సు డ్రైవర్లు, కండక్టర్లు విధిగా సంబంధిత లైసెన్సులు, యూనిఫాం, పీఎస్వీ బ్యాడ్జీలను కలిగి ఉండాలి. విధుల్లో చేర్చుకునే ముందే వారి బ్యాగ్రౌండ్ను యజమానులు సరిచూసుకోవాలని తెలిపిది. బస్సు కదులుతున్న సమయంలో తలుపులన్నీ మూసి ఉంచాలని వెల్లడించింది.ఎవరైనా మహిళ పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించినా.. వేధింపులకు గురిచేసినా బస్సు సిబ్బంది వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్కు లేదా పీసీఆర్ వ్యాన్కు సమాచారం అందించి బస్సును అక్కడికి తరలించాలి. నిబంధనలను కాగితాలకే పరిమితం చేయకుండా కచ్చితంగా అమలు చేస్తామని, ఉల్లంఘిస్తే వాహనాలను సీజ్ చేయడంతో పాటు పర్మిట్లను రద్దు చేస్తామని రవాణా శాఖ మంత్రి డాక్టర్ పంకజ్ కుమార్ సింగ్ హెచ్చరించారు.




