తెలంగాణ రైతులకు లాభదాయకమైన సన్న వరి రకాల సాగునుప్రోత్సహించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఎంపిక చేసిన ఏడు సన్నవరి రకాల సాగుకే క్వింటాకు రూ.500 చొప్పున బోనస్ అందించనుంది. మద్దతు ధరకు అదనంగా ఈ ప్రోత్సాహకం లభించనుండటంతో రైతులు నాణ్యమైన సన్నరకాల వైపు మళ్లే అవకాశం ఉంది. ఈ మేరకు సాగు, పంట నమోదు, కొనుగోళ్లు, క్రయవిక్రయాలకు సంబంధించిన సమగ్ర విధివిధానాలను ప్రభుత్వం ఖరారు చేసింది. మంత్రిమండలి ఆమోదం లభించడంతో ఈ విధానం తక్షణమే అమల్లోకి రానుంది.సన్న బియ్యానికి మార్కెట్లో పెరుగుతున్న డిమాండ్, కేంద్ర ప్రభుత్వం సేకరణలోనూ సన్నరకాలకు ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్కుమార్రెడ్డి, శ్రీధర్బాబులతో ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం క్షేత్రస్థాయిలో పరిస్థితులను అధ్యయనం చేసింది. 2025లో రాష్ట్రంలో మొత్తం 69.89 లక్షల ఎకరాల్లో వరి సాగు జరగగా.. అందులో 43.51 లక్షల ఎకరాల్లో సన్నాలు, 26.38 లక్షల ఎకరాల్లో ముతక రకాల సాగు జరిగింది. అంటే మొత్తం వరి విస్తీర్ణంలో సన్నాల వాటా 62 శాతంగా నమోదైంది.గతేడాది బోనస్ కోసం 33 సన్నరకాలను ప్రభుత్వం గుర్తించగా.. అవి 31.93 లక్షల ఎకరాల్లో సాగయ్యాయి. అయితే ఇందులో కేవలం ఏడు రకాలే 27.95 లక్షల ఎకరాల్లో అంటే 87.51 శాతం విస్తీర్ణంలో సాగైనట్లు ఉపసంఘం గుర్తించింది. ఈ రకాలకే కేంద్ర సేకరణతోపాటు మార్కెట్లోనూ మంచి డిమాండ్ ఉందని తేల్చింది. అనంతరం తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఈ రకాలపై పరిశీలన చేసి రైతులకు లాభదాయకమైనవిగా నిర్ధారించింది. ప్రభుత్వం ప్రాధాన్యం కల్పించిన ఏడు రకాలలో బీపీటీ 5204, ఆర్ఎన్ఆర్ 15048, హెచ్ఎంటీ సోనా, జైశ్రీరామ్, కేఎన్ఎం 1638, డబ్ల్యూజీఎల్ 44, కేఎన్ఎం 7715 ఉన్నాయి. గింజ పొడవు 6 మిల్లీమీటర్లకు తక్కువగా, పొడవు-వెడల్పు నిష్పత్తి 2.5 కంటే ఎక్కువగా, గింజ వెడల్పు 2 మిల్లీమీటర్లకు మించకుండా ఉంటే సన్నరకంగా పరిగణిస్తారు. ఈ ప్రమాణాలకు అనుగుణంగా సాగు చేసిన ధాన్యానికి మద్దతు ధరతో సంబంధం లేకుండా క్వింటాకు రూ.500 బోనస్ చెల్లించనున్నారు.బోనస్ పొందేందుకు పంట నమోదు కీలకంగా మారనుంది. రైతులు వరినాట్లు వేసిన నెలలోపు వ్యవసాయ విస్తరణాధికారులు క్రాప్ బుకింగ్ పోర్టల్లో రైతువారీ వివరాలను నమోదు చేయాలి. విత్తనాలను కంపెనీల నుంచి కొనుగోలు చేశారా, సొంత విత్తనాలతో సాగు చేశారా అనే వివరాలను కూడా నమోదు చేయాల్సి ఉంటుంది. అనంతరం ఏడు ప్రాధాన్య రకాల సాగు చేసిన రైతుల క్రాప్ బుకింగ్ సమాచారాన్ని పౌరసరఫరాల సంస్థకు అందిస్తారు. ఈ డేటా ఆధారంగానే ధాన్యం కొనుగోళ్లు చేపట్టనున్నారు.ఈ వానాకాలంలో ఏడు ప్రాధాన్య సన్నరకాలు 38.19 లక్షల ఎకరాల్లో సాగయ్యే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేసింది. ఇందులో 10.31 లక్షల ఎకరాల్లో కొత్తగా సన్నవరి సాగు ప్రారంభమైనట్లు గుర్తించింది. రైతులకు విత్తనాలు అందుబాటులో ఉంచడంతోపాటు ఏడు రకాలపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని వ్యవసాయశాఖకు సూచించింది. వ్యవసాయ, పౌరసరఫరాలు, పరిశ్రమల శాఖలు సమన్వయంతో కార్యాచరణ ప్రణాళికలు అమలు చేయనున్నాయి. ఈ విధానం ద్వారా రైతులకు అదనపు ఆదాయం, వినియోగదారులకు నాణ్యమైన సన్నబియ్యం, ప్రభుత్వానికి క్రమబద్ధమైన ధాన్యం సేకరణ సాధ్యమవుతుందని అధికారులు భావిస్తున్నారు.





