
జీవితాంతం ఒకరికొకరు తోడుగా నిలిచిన ఆ దంపతులను మృత్యువు కూడా విడదీయలేకపోయింది. భార్య మృతి తట్టుకోలేక భర్త గుండెపోటుతో కన్నుమూయడంతో ఆ కుటుంబం ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయింది. వివరాల్లోకి వెళితే..
నంద్యాల, ఆగస్టు 20: జిల్లాలోని ఆత్మకూరులో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. శ్రీరామ్ నగర్లో నివాసం ఉంటున్న భార్యాభర్తలు ఒకే రోజు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, స్థానికులు కన్నీరుమున్నీరవుతున్నారు. అనారోగ్యంతో భార్య లక్ష్మీదేవి మృతి చెందగా.. ఆమె అంత్యక్రియలు నిర్వహిస్తున్న సమయంలోనే భర్త సుబ్బరాయుడికి గుండెపోటు వచ్చినట్లు సమాచారం. వెంటనే కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించగా.. అప్పటికే ఆయన మృతి చెందినట్లు తెలుస్తోంది. భార్య మృతిని తట్టుకోలేక తీవ్ర మనోవేదనకు గురైన సుబ్బరాయుడు గుండెపోటుతో ప్రాణాలు కోల్పోవడంతో విషాదం నెలకొంది.
జీవితాంతం ఒకరికి ఒకరు తోడుగా నిలిచిన ఆ దంపతులు చావులోనూ తమ అనుబంధాన్ని వీడలేదంటూ స్థానికులు భావోద్వేగానికి గురవుతున్నారు. భార్య మృతితో కుటుంబంలో నెలకొన్న విషాదం నుంచి తేరుకోకముందే భర్త కూడా మృతి చెందడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. శ్రీరామ్ నగర్లో ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.
కొందరు డాక్టర్ల ఇష్టారాజ్యం..రోగులకు ప్రాణ సంకటం
క్రమశిక్షణ కమిటీకి లేఖ రాయనున్న కొండా సురేఖ..
Read Latest AP News And Telangana News And International News And Telugu News





