
Road Accident : మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భింద్ జిల్లాలో కూలీలతో వెళ్తున్న ట్రాలీ వాహనం, ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 8 మంది కూలీలు మృతి చెందగా.. మరో 32 మంది గాయపడ్డారు. గాయపడిన వారందరినీ గోహద్లోని ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. తీవ్రంగా గాయపడిన వారిని మెరుగైన వైద్యం కోసం గ్వాలియర్కు తరలించినట్లు అధికారులు వెల్లడించారు. అయితే, వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
పోలీసుల కథనం ప్రకారం.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లఖింపూర్భేరీకి చెందిన కూలీలు గ్వాలియర్లో వరినాట్లు పూర్తి చేసుకొని సోమవారం అర్ధరాత్రి దాటిన తరువాత తమ గ్రామానికి ట్రాలీ వాహనంలో బయలుదేరి వెళ్తున్నారు. భింద్-గ్వాలియర్ జాతీయ రహదారిపై ఛిమ్కా గ్రామం సమీపంలో రహదారిపైకి వచ్చిన పశువులను తప్పించబోయి డ్రైవర్ ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొట్టడంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద స్థలంలో ఐదుగురు మృతిచెందగా.. ఆస్పత్రికి తరలిస్తుండగా.. మరో ముగ్గురు మరణించారు.





