
భారీ వర్షాలతో ఇగ్వాజు జలపాతం ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చింది. సముద్రపు అలలను తలపించేలా నీరు దూసుకొస్తున్నా.. కొందరు పర్యాటకులు మాత్రం వంతెనపై నిలబడి ఫొటోలు, వీడియోలు తీసుకున్నారు. ఈ భయానక దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
ఇంటర్నెట్ డెస్క్: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో ఇగ్వాజు జలపాతం వద్ద ప్రకృతి ఎంత శక్తివంతంగా మారుతుందో కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది. భారీ వర్షాల అనంతరం ఇగ్వాజు జలపాతంలో నీటి ప్రవాహం ఒక్కసారిగా ఉధృతంగా మారింది. సాధారణంగా అందమైన పర్యాటక ప్రాంతంగా కనిపించే జలపాతం.. ఈసారి భారీ వరద ప్రవాహంతో భయానకంగా దర్శనమిచ్చింది. నీరు గోధుమ, తెలుపు రంగుల్లో అత్యంత వేగంగా కిందకు దూసుకెళ్తుండగా.. చుట్టూ ఎటుచూసినా భారీ నీటి ప్రవాహమే కనిపిస్తోంది. ఇంతటి ప్రమాదకర పరిస్థితుల్లోనూ కొంతమంది పర్యాటకులు వంతెనపై నిలబడి ఫొటోలు, వీడియోలు తీసుకుంటూ కనిపించడం వీక్షకులను మరింత ఆశ్చర్యానికి గురిచేసింది.
అర్జెంటీనా-బ్రెజిల్ సరిహద్దులో ఉన్న ఇగ్వాజు జలపాతం ప్రపంచంలోని ప్రసిద్ధ జలపాత వ్యవస్థల్లో ఒకటి. ఇది ఒకే జలపాతం కాకుండా సుమారు 2.7 కిలోమీటర్ల పరిధిలో విస్తరించిన 275కు పైగా చిన్న, పెద్ద జలపాతాల సమాహారం. ఇందులో అత్యంత ప్రసిద్ధమైన భాగం ‘గార్గాంటా డెల్ డియాబ్లో’ లేదా ‘డెవిల్స్ థ్రోట్’. వర్షాకాలంలో ఇక్కడ నీటి ప్రవాహం భారీగా పెరుగుతుంది. భారీ వర్షాలు కురిసినప్పుడు ప్రశాంతంగా కనిపించే జలపాతం ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చుతుంది. ఈ వైరల్ వీడియోలోనూ నీటి ప్రవాహం సాధారణం కంటే అనేక రెట్లు బలంగా కనిపిస్తోంది. ఉధృతంగా ప్రవహిస్తున్న నీటిని చూస్తేనే ప్రకృతి శక్తి ఎంతటి ప్రమాదకర స్థాయికి చేరగలదో అర్థమవుతోంది.
ఈ వీడియో @FLCons అనే సోషల్ మీడియా ఖాతా ద్వారా షేర్ చేశారు. వీడియోలో.. జలపాతం ఉగ్రరూపంలో ఉన్నప్పటికీ కొంతమంది పర్యాటకులు వంతెనలు, నడకదారుల వద్ద నిలబడి ఫొటోలు, వీడియోలు తీసుకుంటున్న దృశ్యాలు నెటిజన్లను ఆందోళనకు గురిచేస్తున్నాయి. నీటి ప్రవాహం అంత బలంగా ఉన్న సమయంలో అక్కడ నిలబడటం ఎంతవరకు సురక్షితమని పలువురు ప్రశ్నిస్తున్నారు. మరికొందరు మాత్రం ఇలాంటి ప్రదేశాల్లో దూరం నుంచి మాత్రమే ఫొటోలు తీసుకోవాలని సూచిస్తున్నారు. వీడియో చూసిన చాలామంది ఇగ్వాజు జలపాతం అందంతో పాటు దాని ఉగ్రరూపాన్ని కూడా గుర్తుచేస్తోందని వ్యాఖ్యానిస్తున్నారు.
Read Latest AP News And Telangana News And International News And Telugu News





