
హైదరాబాద్లోని ఇనార్బిట్ మాల్ సమీపంలో చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదం కేసులో కీలక పురోగతి లభించింది. ఈ ప్రమాదానికి కారణమైన కారును జనసేన రాజ్యసభ సభ్యుడు లింగమనేని రమేశ్ కుమారుడు లింగమనేని సంజూష్ నడిపినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అతడిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.గత నెల ఆగస్టు 16వ తేదీ రాత్రి ఇనార్బిట్ మాల్ ఎదురుగా రోడ్డు దాటుతున్న భారతి ముఖి (26) అనే యువతిని అతివేగంగా వచ్చిన ఆస్టన్ మార్టిన్ కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. మృతురాలు ఓ లైఫ్స్టైల్ స్టోర్లో సేల్స్గర్ల్గా పనిచేస్తోంది. కాగా, ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా అక్కడి నుండి పరారయ్యాడు.ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, సీసీటీవీ ఫుటేజ్, వాహనం రిజిస్ట్రేషన్ నంబర్ (టీజీ-09-జీ-0666) ఆధారంగా లోతైన దర్యాప్తు చేపట్టారు. విచారణలో భాగంగా, ప్రమాద సమయంలో కారును సంజూష్ నడుపుతున్నట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అజాగ్రత్తగా వాహనాన్ని నడిపి మరణానికి కారణమైనందుకు అతడిపై భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 106(1) కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి తదుపరి విచారణ కొనసాగుతోంది.





