
Visakhapatnam Crime : విశాఖపట్టణం షీలానగర్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. షీలానగర్ జంక్షన్ వద్ద మట్టికుప్పలో మూడు మృతదేహాలు బయటపడటం స్థానికంగా కలకలం రేపింది. లారీలోకి మట్టి ఎత్తి వేస్తుండగా మూడు మృతదేహాలు కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
షీలానగర్ జంక్షన్ వద్ద నిర్మాణంలో ఉన్న షీలానగర్ – సుబ్బవరం పోర్టు కనెక్టివిటీ రోడ్డు నిర్మాణ పనుల కోసం తెచ్చిన మట్టి నుంచి ఈ మృతదేహాలు బయటపడ్డాయి. మృతదేహాలు పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో ఉండటంతో మృతులు ఎవరనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. పోలీసులు ఘటన స్థలికి చేరుకొని మృతదేహాలను స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం పంపించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది.
అయితే, మృతదేహాలు ఎవరివన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. మృతులు షీలానగర్ ప్రాంతానికి చెందినవారా? మృతదేహాలు మట్టికప్పులోకి ఎలా వచ్చాయి.. ఎవరైనా కావాలనే అక్కడ పడేసి వెళ్లారా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.




