
సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
80th Independence Day: స్వాతంత్య్ర వేడుకలకు తెలంగాణలో భారీ స్థాయిలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. వాడవాడలా స్వాతంత్య్ర వేడుకలు జరగనుండగా రాష్ట్రస్థాయిలో గోల్కొండలో సంబరాలు జరగనున్నాయి. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఓ ప్రకటన విడుదల చేశారు.
రాష్ట్ర ప్రజలకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపినట్లు బీఆర్ఎస్ పార్టీ తెలిపింది. 'పరాయి వలస పాలనను పారదోలి 1947 ఆగస్టు 15న భారతదేశం స్వయంపాలనను సాధించుకుంది. నిస్వార్థ పోరాట స్ఫూర్తి, దార్శనిక నాయకత్వం, త్యాగంతో కూడిన ప్రజల భాగస్వామ్యమే దేశానికి స్వాతంత్య్రాన్ని అందించాయి' అని మాజీ సీఎం కేసీఆర్ గుర్తుచేసుకున్నారు.
'79 వసంతాలు పూర్తి చేసుకుని 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని చేసుకుంటున్న ఈ శుభసందర్భంలో దేశ సామాజిక న్యాయం, ఆర్థిక ప్రగతిని ప్రతి ఒక్కరూ పునశ్చరణ చేసుకోవాలి' అని గులాబీ బాస్ కేసీఆర్ తెలిపారు. ఫెడరల్ పాలనా విధానం, సెక్యులర్ స్ఫూర్తితో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారతదేశం మరింత ముందుకు సాగేందుకు ఇంకా చేరుకోవాల్సిన లక్ష్యాలను గుర్తించాల్సిన అవసరం ఉందని మాజీ సీఎం కేసీఆర్ గుర్తుచేశారు. భవిష్యత్తులో దేశ పాలనలో భాగస్వామ్యం కానున్న నేటితరం మరింత జ్ఞానం, సహనం, దార్శనికతతో ముందడుగు వేసినప్పుడే స్వాతంత్య్ర ఉద్యమ త్యాగాల ఫలాలు ప్రతి గడపకు చేరుతాయని తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
అంత్యక్రియలకు హాజరు తన కుటుంబంలో చోటుచేసుకున్న విషాద సంఘటనతో కేసీఆర్ స్వాతంత్య్ర వేడుకలకు దూరంగా ఉండే అవకాశం ఉంది. తన సతీమణి శోభమ్మ సోదరుడు, కేసీఆర్ బామ్మర్ది మృతిచెందడంతో కల్వకుంట్ల కుటుంబం మొత్తం విషాదంలో మునిగింది. బావమరిది అంత్యక్రియల్లో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పాల్గొని ఆఖరి నివాళి అర్పించారు. అంతకుముందు మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం కుటుంబాన్న ఓదార్చారు. ఇక తన సోదరుడు మృతిచెందడాన్ని కేసీఆర్ భార్య శోభమ్మ తట్టుకోలేకపోతున్నారు. సోదరుడి మృతదేహం చూసిన అనంతరం శోభమ్మ తీవ్ర కన్నీటి పర్యంతమయ్యారు. కంటతడి పెట్టడంతో కేసీఆర్ ఆమెను ఓదార్చారు.





