
ఇంటర్నెట్ డెస్క్: ఆగస్టు 5న చైనాలో విడుదలైన ఓ యానిమేషన్ సినిమా కథ ఇది. సాధారణంగా ఒక సినిమా హిట్ కావాలంటే గొప్ప కథ, అద్భుతమైన విజువల్స్, కోట్ల బడ్జెట్, వీటన్నింటికీ మించి భారీ ప్రచారం ఉండాలి. కానీ, ఈ సినిమాకు ఇవేమీ లేవు. పైగా సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ‘‘ఛీ.. ఇంత చెత్త సినిమా జీవితంలో చూడలేదు’’ అని తిట్టుకున్నారు. కానీ, అదే ఇప్పుడు ఆ సినిమాను బాక్సాఫీస్ దగ్గర బ్లాక్బస్టర్ చేసింది. మరి ఈ ‘న్యూ లాయ్’ కథేంటో చూద్దాం..
ఈ సినిమా పేరు ‘న్యూ లాయ్’ (Niu Lai) అంటే తెలుగులో ‘ఆవు వస్తోంది’ అని అర్థం. 86 నిమిషాల నిడివి ఉన్న ఈ యానిమేషన్ చిత్రంలో లేగదూడ, పిచ్చుక మధ్య జరిగే విచిత్రమైన కలల ప్రపంచాన్ని చూపించారు. ఈ సినిమాను రూపొందించింది కూడా హాలీవుడ్ స్టూడియోలు కాదు.. కేవలం ఇద్దరే అని ప్రచారంలో ఉంది. తల్లీకొడుకు ఐదేళ్ల పాటు శ్రమించి, రైటింగ్, డైరెక్షన్, డబ్బింగ్, ప్రొడక్షన్.. అన్నీ వాళ్లే చేసి దీన్ని విడుదల చేశారు. దీనికి దాదాపు రూ. లక్ష ఖర్చు అయ్యింది. సినిమా రిలీజ్ అయ్యాక మొదటి 10 రోజుల్లో చైనా అంతా కలిపి కేవలం 300 మంది మాత్రమే టికెట్లు కొన్నారు. దీంతో 7,700 యువాన్ల (సుమారు రూ.1.04 లక్షలు) కలెక్షన్స్ మాత్రమే వచ్చాయి. ఈ సినిమాకు ఈ మాత్రం రావడమే ఎక్కువ అనుకున్నారంతా. 2026లో విడుదలైన చెత్త సినిమా ఇదే అని కామెంట్స్ వచ్చాయి.
అయితే, ఊహించని మలుపు అక్కడ మొదలైంది. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు, గ్రాఫిక్స్ వీడియోలు సోషల్ మీడియాలో షేర్ అయ్యాయి. ‘ఇది మరీ ఘోరంగా ఉంది’, ‘దీని కంటే ఏఐ బాగా తీస్తుంది’ అని నెటిజన్లు దారుణంగా ట్రోల్స్ చేశారు. అక్కడితో ఆగకుండా మీమ్స్ చేయడం మొదలుపెట్టారు. అవి విపరీతంగా వైరల్ అయ్యాయి. అసలు ఈ సినిమాలో ఏముందో మనమూ చూద్దాం.. అని జనాలు థియేటర్లకు క్యూ కట్టడం ప్రారంభించారు. దీంతో ట్రోలింగే ఈ సినిమాకు ఉచిత ప్రచారంగా మారింది.
ట్రోల్స్ దెబ్బకి థియేటర్లలో జనం పెరిగారు. చూస్తుండగానే ఈ చిత్రం ఇప్పటివరకు చైనా బాక్సాఫీస్ వద్ద 14.9 మిలియన్ యువాన్లు (సుమారు రూ. 20 కోట్లు) వసూలు చేసింది. ఏకంగా చైనాలో ‘స్పైడర్ మేన్’, ‘ది ఒడిస్సీ’లాంటి భారీ హాలీవుడ్ చిత్రాల కలెక్షన్ల రికార్డులకే పోటీగా నిలిచింది.
ఏది ఏమైనా, సినిమా బాగుంటేనే కాదు.. మరీ ఘోరంగా ఉన్నా జనాలు చూస్తారు.. అని నిరూపిస్తూ ఈ ‘న్యూ లాయ్’ బాక్సాఫీస్ చరిత్రలోనే ఒక విచిత్రమైన రికార్డును క్రియేట్ చేసింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





