
ఇంటర్నెట్ డెస్క్: ధ్రువ్ విక్రమ్ తన వ్యక్తిగత జీవితంపై జరుగుతోన్న ప్రచారం, ఎదురవుతోన్న విమర్శలపై స్పందించారు. నటి అనుపమ పరమేశ్వరన్ ఇటీవల చేసిన వ్యాఖ్యల అనంతరం తనపై (Dhruv Vikram) వస్తున్న వార్తల గురించి ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు.
నటి పేరు ప్రస్తావించనప్పటికీ.. బ్రేకప్ గురించి ధ్రువ్ విక్రమ్ మాట్లాడారు. ‘‘నా బ్రేకప్ తర్వాత ఎదురైన కష్టకాలం నన్ను వ్యక్తిగతంగా ఎంతో ప్రభావితం చేసింది. కానీ, నా కుటుంబం, అభిమానులు అందించిన కొండంత ధైర్యం వల్లే నేను దాని నుంచి బయటకు రాగలిగాను. సినీ పరిశ్రమలోకి వచ్చేటప్పుడే నా వ్యక్తిగత జీవితంపై అందరూ దృష్టి పెడతారని తెలుసు. ఆ సమయంలో మా అమ్మ నాకు ఎప్పటికప్పుడు ధైర్యాన్నిచ్చింది’’ అని తెలిపారు.
‘‘నిజం చెప్పాలంటే, ఈ ప్రచారం నన్ను అస్సలు ప్రభావితం చేయలేదని నేను చెప్పలేను. కానీ, ఇలాంటి సమయంలో మనల్ని మనం ఎక్కువ అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. మనమేమిటో, దేనికోసం నిలబడ్డామో తెలుసుకోవాలి. మనకు నచ్చిన వారిని, మన ప్రాణంగా భావించే ప్రతి విషయాన్ని కాపాడుకోవాలి. మన ప్రవర్తన నిజాయతీగా ఉన్నప్పుడు, ఈ విమర్శలు మనల్ని ఏం చేయలేవు’’ అని అన్నారు.
తాను సోషల్ మీడియాలో తక్కువ సమయం గడుపుతానని ధ్రువ్ తెలిపారు. ‘‘నాకు ఎడిటింగ్ చేయడం, వీడియోలు తీయడం అంటే చాలా ఇష్టం. వీడియోలను షూట్ చేసి మ్యూజిక్కి తగ్గట్టుగా కట్ చేస్తుంటాను. వాటిని సోషల్ మీడియాలో పంచుకోను కానీ, అది నాకు చాలా ఇష్టమైన పని. సినిమాలు విడుదలయ్యేటప్పుడు ప్రమోషన్స్ ఉన్నప్పుడు మాత్రమే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటాను. మిగిలిన సమయాల్లో పుస్తకాలు చదవడం, సంగీతం వినడంలో మునిగిపోతాను’’ అని చెప్పారు.
ఇక అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన రిలేషన్ గురించి చెప్పిన మాటలు వైరలైన విషయం తెలిసిందే. గతంలో రెండేళ్ల పాటు ఒక వ్యక్తితో రిలేషన్షిప్లో ఉన్నప్పుడు నరకం అనుభవించినట్లు చెప్పారు. మానసిక వేధింపులకు గురయ్యానని, శారీరకంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నానని తెలిపారు. ఆ వ్యక్తి ఎవరనేది మాత్రం ఆమె గోప్యంగా ఉంచినప్పటికీ గతంలో ఆమె సోషల్ మీడియాలో పెట్టిన కొన్ని ఫొటోలతో ధ్రువ్ పేరు బయటకు వచ్చింది. వీరిద్దరూ రిలేషన్లో ఉన్నట్లు వార్తలు కూడా ప్రచారమయ్యాయి. వీరిద్దరూ కలిసి ‘బైసన్’ సినిమాలో నటించిన సమయంలో ఈ రూమర్స్ వచ్చాయి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





